Deputy Cm Pawan Kalyan Kadapa Tour: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్బాబుపై దాడి ఘటనను సీరియస్గా తీసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయనే నేరుగా రంగంలోకి దిగనున్నారు.. అందులో భాగంగా.. రేపు కడపలో పర్యటించబోతున్నారు.. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించనున్నారు పవన్ కల్యాణ్.. ఈ రోజు గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించగా.. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు.. నేరుగా వెళ్లి జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ కల్యాణ్..
Read Also: Congress: మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలాన్ని కోరిన కాంగ్రెస్..
మరోవైపు ఈ ఘటనపై కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డ ఆయన.. ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేశారు. గాలివీడు ఎంపీడీవోపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో పవన్ కల్యాణ్ చర్చించారు. కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు పవన్.. ఇక, ఎంపీడీవోకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు పవన్ కల్యాణ్.. ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని.. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీవో ఆరోగ్యం గురించి వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన విషయం విదితమే..