Ambati Rambabu: తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ను ఆయన నివాసంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. ఓ కేసులో అరెస్టై బెయిల్ పై విడుదలైన అంబటి.. తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం అంశాలను జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందాం అని మాజీ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
అయితే, అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును ఈ సందర్భంగా వైసీపీ అధినేత, వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధీటుగా ఎదుర్కొందాం అని పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలుద్దాం, పార్టీ నాయకులు, క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జగన్ని కలిసిన వారిలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు.