విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల భూబి ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్పై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఈ ఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
Read Also: కోవిడ్ బాధితులకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్ ట్రస్ట్
రెవెన్యూ అధికారులపై దాడి ఘటనపై జిల్లా కలెక్టర్ మల్లికార్జున సీరియస్ అయ్యారు. వైసీపీ నేత దొడ్డి కిరణ్ను భూ కబ్జాదారుడిగా పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్కు కలెక్టర్ లేఖ రాశారు. దొడ్డి కిరణ్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యేకంగా లేఖలో పేర్కొన్నారు. దొడ్డి కిరణ్తో పాటు దాడి చేసిన 20 మందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. దీంతో దొడ్డి కిరణ్ గ్యాంగ్పై పెందుర్తి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా దొడ్డి కిరణ్ గ్యాంగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.