GVMC New Mayor: ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగరేయాలన్న టీడీపీ కల ఎట్టకేలకు నెరవేరింది. ఏడాది కాలపరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి విజయం లాంఛనం అయింది. మేయర్ అభ్యర్ధిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ బీఫార్మ్ ను పీలాకు అందజేశారు నగర పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. 98 వార్డులతో వున్న మహా విశాఖ నగర పాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి వున్న స్టీల్ సిటీ పై పట్టు సాధించాలంటే మేయర్ పీఠం కీలకం. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి విశాఖ కంచుకోటే అయినప్పటికీ స్ధానిక సంస్ధలపై ఆజిమాయిషీ చేసే ఛాన్స్ లభించలేదు. 2011లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. నలుగురు ఎమ్మెల్యేల బలం వుండి కూడా టీడీపీ 28 స్థానాలకు పరిమితం అయింది.
Read Also: Malla Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికపై.. మల్లారెడ్డి మాస్ డ్యాన్స్..
ఇక, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీస్ నాయకత్వం మార్పు అనివార్యం అయింది. ఆ జాబితాలో జీవీఎంసీ చేరగా అనూహ్యమైన రాజకీయ పరిణామాలు, క్యాంప్ రాజకీయాలు జరిగాయి. వైఎస్సార్సీపీ, కూటమి పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మ్యాజిక్ ఫిగర్ 74 కోసం ఆఖరి నిముషం వరకు ఊగి సలాట కొనసాగడంతో ఫలితం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె, 6వ వార్డు కార్పోరేటర్ లక్ష్మీ ప్రియాంక ఓటుతో కూటమి గట్టెక్కింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నాలుగేళ్ల గ్రేటర్ విశాఖ మేయర్ గా పనిచేసిన గొలగాని హరివెంకటకుమారి పదవిని కోల్పోయారు. ఇక, డిప్యూటీ మేయర్ జియ్యాన్ని శ్రీధర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ చేసింది కూటమి. దీంతో మేయర్, డీప్యూటీ మేయర్ స్ధానాలు ఖాళీ అయ్యాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ముందుగా మేయర్ ఎలక్షన్ జరుగుతుంది. మొదటి నుంచి ప్రచారంలో వున్న పీలాశ్రీనివాస్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఉత్త రాంధ్ర పర్యటనలో ముఖ్యమంత్రి దగ్గరకు పీలాను తీసుకు వెళ్లిన ఎమ్మెల్యేలు ఆయన అభ్యర్ధిత్వానికి ఆమోదం లభింపజేసుకున్నారు.
Read Also: Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. టెర్రరిస్టుల ఎలా వచ్చారంటే..?
మరోవైపు, డిప్యూ టీ మేయర్ పీఠంపై కూటమి పార్టీలు మల్లగుల్లాలుపడుతున్నాయి. మొదట్లో మేయర్ టీడీపీ, డిప్యూటీ మేయర్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాల ఆధారంగా బీసీ గవర కులానికి చెందిన పీలా శ్రీనివా స్ కు మేయర్ ఇస్తున్నందున.. జనసేన నుంచి కాపులకు ఛాన్స్ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. పెద్దిశెట్టి ఉషశ్రీ పేరు చుట్టూ ఊహాగానాలు నడిచాయి. ఐతే, డీప్యూటీ మేయర్ విషయంలో టీడీపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. హరివెంకటకుమారిపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు యాదవ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. బీసీ మహిళను పదవి నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారనే ఆందోళన వ్యక్తం అయింది. రాజకీయ కారణాలతో హరి వెంకట కుమారిని మేయర్ పీఠం నుంచి దించేసిన యాదవులకు సముచిత స్ధానం కల్పించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ దిశగా ఆలోచనలు చేసి డిప్యూటీ మేయర్ స్ధానం కోసం యాదవ మహిళను ఎంపిక చేయడం సముచితమనే భావనలో టీడీపీ వున్నట్టు కనిపిస్తోంది. ఆ దిశగా జనసేనతో చర్చలు జరుగుతున్నాయి. ఇరు పార్టీలు ఏకాభిప్రాయం సాధించగలిగితే డిప్యూటీ మేయర్ సైతం టీడీపీ కోటాలో చేరుతుంది. టీడీపీ కార్పొరేటర్లు గొలగాని నాగవేణి, మొల్లి హేమలతల్లో ఒకరికి ఛాన్స్ లభిస్తుందనే ప్రచారం ఉంది..