Pahalgam Terror attack: 26 మంది టూరిస్టుల ప్రాణాలను తీసిన పహల్గామ్ ఉగ్ర దాడిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల ప్లానింగ్, వారికి సాయం చేసిన వారి గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక సమాచారాన్ని వెలికి తీశాయి. ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు, ఒకరు స్థానిక ఉగ్రవాది దాడిలో పాల్గొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం, ఉగ్రవాదులు K-47, M4 రైఫిల్స్ వాడినట్లు తెలిసింది. అత్యంత క్లిష్టతరమైన హిమాలయాలు, దట్టమైన అరణ్యాల్లో గంటల కొద్ది ప్రయాణించి పహల్గామ్ చేరినట్లు తెలుస్తోంది. కొకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయకు దాదాపు 20-22 గంటల కష్టతరమైన భూభాగం గుండా నడిచి వచ్చి ప్రాణాంతక దాడిని అమలు పరిచినట్లు తెలుస్తోంది.
దాడి సమయంలో ఉగ్రవాదులు రెండు మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఒకటి స్థానికుడి కాగా, మరొకటి పర్యాటకుడి. స్థానిక ఉగ్రవాదిని ఆదిల్ థోకర్గా భద్రతా బలగాలు గుర్తించాయి. థోకర్ 2018లో హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. పాకిస్తాన్ వెళ్లి ట్రైనింగ్ పొందాడు. 2024లో కాశ్మీర్ లోయకు తిరిగి వచ్చే ముందు లష్కరే తోయిబాతో యుద్ధ శిక్షణ పొందాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి థోకర్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు లాజిస్టిక్ సాయం అందిస్తున్నాడు. కాశ్మీర్ భౌగోలిక స్వరూపంపై ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చాడు.
పహల్గామ్ దాడి సమయంలో దుకాణాల వెనుక నుంచి ఇద్దరు ఉగ్రవాదులు బాధితులను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి నలుగురిని కాల్చి చంపారు. దీనికి ముందు వారిని కల్మా పఠించమని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాల్పులతో ఒక్కసారిగా పర్యాటకులు భద్రత కోసం అన్ని దిశల్లో పరుగులు తీశారు. అదే సమయంలో జిప్ లైన్ ప్రాంతం దగ్గర ఉన్న మరో ఇద్దర ఉగ్రవాదులు కాల్పులు జరిపి రక్తపాతాన్ని మరింత తీవ్రం చేసినట్లు తెలుస్తోంది.
ఘటన సమయంలో స్థానిక ఫోటో గ్రాఫర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనను ఆయన రికార్డ్ చేయగలిగాడు. ఇది ఇప్పుడు భద్రతా బలగాల దర్యాప్తుకు కీలకంగా మారింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారిస్తోంది. సీన్ రికన్స్ట్రక్షన్ చేయడానికి ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. లోయలోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారు, పారిపోయారనే విషయాలను నిశితంగా గనిస్తున్నారు.