బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో బెల్ట్ షాపు నిర్వహణ, నాటుసారా అమ్మకాలకు వేలంపాట నిర్వహించారు. అయితే గ్రామంలోని అధికారులు ఈ వేలంపాట నిర్వహించిన విధానం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. గ్రామంలోని ఓ ఆలయంలో వేలంపాట నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లిక్కర్ షాపు కోసం ఆలయంలో వేలం పాట నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో లిక్కర్ షాపు కోసం వేలం పాట పెట్టి ఓ వర్గాన్ని అవమానపరిచారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వేలం పాటలో బెల్టు షాపును రూ.7 లక్షలకు ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. ఆలయంలో వేలంపాట నిర్వహించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.