Tirumala: ఈ మధ్య తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న టీటీడీ.. బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలకు సిద్ధం అవుతుంది..? వైరల్ అయిన వీడియో నిజమా? లేదా ఫేక్దా అనేది తేలాల్సి ఉన్నా.. ఈ ఘటనతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.. శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాల వ్యవహారంపై స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్కు పర్మిషన్ ఇచ్చింది వాస్తవం.. అన్నదానం వద్ద నుండి డంపింగ్ యార్డ్ వరకు వారికి డ్రోన్ సర్వేకు పర్మిషన్ ఇచ్చాం అన్నారు. టీటీడీలో భద్రతకు ఎక్కడా రాజీ పడటంలేదు.. టీటీడీ దగ్గర హై సెక్యురీటీ వ్యవస్థ ఉందన్నారు.. ఇక, త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామని ప్రకటించారు ధర్మారెడ్డి.
ఇప్పటికే డ్రోన్ల వ్యవహారంపై కేసు నమోదు చేశాం.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈవో.. వైరల్ అయినా వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందన్న ఆయన.. డ్రోన్ ఆపరేటర్ లు అత్యుత్సాహంతో వీడియోలు తీసుంటే చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.. ఫేక్ వీడియోలైతే ఏం చేయలేం.. కానీ, నిజమైన వీడియోలే అయితే చర్యలు తప్పవన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మరోవైపు.. శ్రీవాణి ట్రస్టు నిధులు దారి మళ్లుతున్నాయనే ప్రచారంపై స్పందించిన ఆయన.. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.650 కోట్ల నిధులు సమకూరాయి.. దేవాదాయశాఖ ద్వారా 932 ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి.. దేవాదాయశాఖ నిర్మిస్తున్న ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నుండి రూ.100 కోట్లు కేటాయించాం.. ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామన్నారు.. 647 ఆలయాలకు వినతులు వచ్చాయి.. శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు రూ.130 కోట్లు కేటాయించాం.. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేక అకౌంట్ ఉంటుంది.. జనరల్ అకౌంట్ కు శ్రీవాణి ట్రస్టు నిధులు వచ్చే అవకాశంలేదని. శ్రీవాణి ట్రస్టు నిధులు 50 శాతం టీటీడీ జనరల్ అకౌంట్ కు వెళ్తున్నాయనేది అవాస్తవమని స్పష్టం చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.