చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం వలసపల్లెలో విషాదం నెలకొంది. గ్రామంలో సంప్రదాయంగా వస్తున్న పశువుల పండగను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ ఆలయం వద్ద పొట్టేలును బలి ఇచ్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. పొట్టేలును అమ్మవారికి బలిచ్చే ముందు అక్కడున్నవారంతా మద్యం సేవించారు. అనంతరం పొట్టేలును బలిచ్చే క్రమంలో 35 ఏళ్ల సురేష్ అనే వ్యక్తి పొట్టేలును గట్టిగా పట్టుకున్నాడు.
Read Also: అకాల వర్షం…అన్నదాతకు అపారనష్టం
అయితే మద్యం మత్తులో ఉన్న మరో వ్యక్తి పొట్టేలుకు బదులుగా ప్రమాదవశాత్తూ దానిని పట్టుకున్న సురేష్ తలను నరికేశాడు. దీంతో సురేష్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో పశువుల పండగలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామస్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.