TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది టీటీడీ.. అవన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది.. నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద జల్లడం శోచనీయం. శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడటం అన్నది పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగిందని తెలిపింది టీటీడీ.. శ్రీవారి ఆలయంలో గానీ, వెలుపల గానీ, ఉభయ కాలిబాట మార్గాల్లో, కళ్యాణ కట్ట, శ్రీవారి సేవ, బయట క్యూలైన్లు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేశాం. వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక – మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం అని పేర్కొంది టీటీడీ..
ఇక, అర్చకులను తనిఖీ చేయడమన్నది పూర్తిగా వాస్తవ దూరం. అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయని తన ప్రకటనలో పేర్కొంది టీటీడీ.. మరోవైపు. పలు పీఠాధిపతులకు నోటీసులు అంటూ భూమన చేసిన ఆరోపణలపై స్పందించిన టీటీడీ.. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. గతంలో టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి.. గత సంవత్సర కాలంలో టీటీడీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. టీటీడీ కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతులు, ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.
Read Also: Air India: బ్రేకింగ్ న్యూస్.. ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీ కొట్టిన పక్షి..
మరోవైపు, ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పి భక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని భూమనకు హితవు చెప్పింది టీటీడీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నాం. బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నాం. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు, శుక్ర, శని, ఆది వారాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నాం. టీటీడీ అందిస్తున్న వివిధ సౌకర్యాలపై మూడు విధాలుగా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. IVRS, WHATSAPP, శ్రీవారి సేవకులు ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాల్లో 90 శాతానికి పైగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాద, వసతి, తాగునీరు, లడ్డూ ప్రసాదాలు, తదితర సేవలపై సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. ఇక ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
2023 సంవత్సరం పరకామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సంవత్సర కాలంగా ఒక పకడ్బందీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపింది టీటీడీ.. ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పున:స్థాపించేలా పరకామణిలో SoP తయారు చేశాం. ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ SoP లో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వల్ల గత సంవత్సర కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవాలు ఈ విధంగా వుండగా సదరు మాజీ చైర్మన్ ఆధ్యాత్మిక సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని తెలియజేస్తున్నాం.. వ్యవస్థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాం అంటూ ఓ ప్రకటనల విడుదల చేసింది టీటీడీ..
Read Also: India vs England: సాయి సుదర్శన్ అరంగ్రేటం.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్..!
కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. శ్రీవారి ఆలయంలో వేద పారాయణం అవసరం లేదని టీటీడీ అధికారి దబాయించడం అపచారని వ్యాఖ్యానించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. వేదం పఠనం ఎవరికీ అర్థం కాదని వద్దని టీటీడీ ఉన్నతాధికారి అధికార దర్పం ప్రదర్శించడం సరికాదన్న ఆయన.. నిత్యం శ్రీవారి ఆలయంలో నాలుగు వేదాలు పఠనం జరుగుతున్న విషయం టీటీడీ అధికారి తెలుసు కోవాలి. వేద అభ్యాసనం పెంచాలనే టీటీడీనే 6వేద పాఠాశాలను నిర్వహిస్తోంది.. టీటీడీ ని ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు ఆలయంలో వేద పారాయణం నిషేధించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో వంశ పార్య పరంగా సేవలు అందించే అర్చకులకు విజిలెన్స్ సిబ్బంది అణువణువు తనిఖీలు చేయడం మంచిది కాదు. వేదం వద్దు, పారాయణం వద్దని చెప్పడం టిటిడి అధికారికి తగదు. తిరుమలలో మఠాల్లో పొయ్యి వెలిగించవద్దని టిటిడి అధికారి తాఖీదులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించారు.. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న పీఠాధిపతుల పై స్వారీ చేయడం సరికాదు.. పీఠాధిపతులు ఆర్ఆర్ఎస్ చీఫ్ కు పిర్యాదు చేయడంతో టీటీడీ అధికారులకు మొట్టికాయలు పడ్డాయి.. పరకామణి లో సిబ్బందికి నరకం చూపిస్తున్న పరిస్థితి నెలకొంది అంటూ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొనగా.. భూమన వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది టీటీడీ..