Nallamilli Moola Reddy Passes Away: తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి (80) సోమవారం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నల్లమిల్లి మూలారెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని తన స్వగ్రామం రామవరంలోనే ఉంటున్న మూలారెడ్డి ఆది నుంచి టీడీపీ నేతగానే కొనసాగారు. 1970లో రామవరం సర్పంచ్ గా మూలారెడ్డి ఎన్నికయ్యారు. అనపర్తి నియోజకవర్గం నుంచి ఏకంగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భవించాక 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనపర్తి నుంచి పార్టీ అభ్యర్థిగా మూలారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
Read Also: NTR: వీలైతే నాలుగు మాటలు… కుదిరితే కప్పు కాఫీ!
1983 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 1985, 1994, 1999 ఎన్నికల్లోనూ మూలారెడ్డి అనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసిన మూలారెడ్డి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మూలారెడ్డి బదులుగా ఆయన కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా మూలారెడ్డి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలియజేశారు.