అసెంబ్లీలో నన్ను ఎగతాళి చేశారు.. అవమానాలకు గురి చేశారు.. అయినా భరించాను. చివరకు కుటుంబ సభ్యులను కూడా దూషించారు.. గౌరవాన్ని దెబ్బతీశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని మళ్లీ సీఎంగా వస్తానని సవాల్ విసిరి వచ్చేశాను. నేను సీఎంగా ఉన్నాను.. ప్రతిపక్ష నేతగా పని చేశాను. నేనూ మనిషినే.. భార్యకు భర్తనే. నేనెప్పుడూ ఇంట్లో ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రజల ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు డాక్యుమెంట్లు ఇస్తానంటూ ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారంలోకి రాగానే నెల రోజుల్లో ఇళ్లకు డాక్యుమెంట్లు ఉచితంగా ఇస్తాం. కిళ్లి కొట్లో ఆన్ లైన్లో చెల్లిస్తే కిళ్లి ఇస్తారు.. కానీ మద్యం దుకాణంలో మాత్రం డబ్బులే చెల్లించాలి. ఆన్లైన్ చెల్లింపులైతే సాయంత్రానికల్లా పంపకాలు కుదరవని మద్యం దుకాణాల్లో ఆన్లైన్ సేవలు పెట్టలేదు అని పేర్కొన్నారు.
మూడు రాజధానుల చట్టం చేశారు.. కోర్టులో ఇబ్బంది వస్తుందని చట్టాన్ని రద్దు చేశారు. మళ్లీ మూడు రాజధానుల చట్టం చేస్తానంటున్నారు.. ఇదేం పరిపాలన. మంత్రి వరి పంట వెయ్యొద్దు అంటారు…మరి ఏమి వెయ్యాలి…గంజాయి పంట వేయిస్తారా అని ప్రశ్నించారు. పోలవరం గురించి ఎగిరెగిరి మాట్లాడారు.. 2021 డిసెంబర్ నాటికి పోలవరం కట్టేస్తానన్నారు. సీఎం, ఇరిగేషన్ మంత్రి ఏం సమాధానం చెబుతారు.. పోలవరాన్ని ప్రారంభించడండి.. ప్రేకక్షుడిగా చూడడానికి సిద్దంగా ఉన్నా అని అన్నారు. వైఎస్ ప్రారంభించిన అభయ హస్తం స్కీంను జగన్ తీసేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ మిగులు నిధుల పైనా సీఎం జగన్ కన్నేశారు. నిన్నటి వరకు ఓటేస్తే ఏం చేస్తామో చెప్పాం.. ఓటేయకుంటే ఏం కట్ చేస్తామో జగన్ చెబుతున్నారు. గురజాలలో చనిపోయిన ఎనిమిది మంది కార్యకర్తలకు లక్ష ఆర్థిక సాయం ఇస్తాం. క్వారీలో పడి చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ. 50 వేలు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.