Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పలువురు నేతలు, మాజీ మంత్రులపై కేసులు నమోదు అయ్యాయి.. తాజాగా, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. పోలీసులు కేసు పెట్టారు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ గనికి సంబంధించి లీజు కాలం ముగియడంతో.. వైసీపీ నేతలు దానిని ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని.. అంతేకాక రాళ్ళను పేల్చేందుకు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశారని.. ఈ విషయంపై అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైన్ వద్దే నిరసన దీక్ష చేపట్టారు. పేలుడుకు ఉపయోగించే జిలేటెన్ స్టిక్స్ తో పాటు ఇతర రసాయనాలను అధికారులకు అప్పగించారు.
Read Also: UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు
అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్పట్లో ఆదేశించింది. అప్పటి నుంచి గనిలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అక్రమ మైనింగ్ పై మరోసారి సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణ జరిపి పదిమందిపై కేసులు నమోదు చేసింది. వీరిలో ఏ1గా.. వైసీపీ నేత పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి.. ఏ2గా వాకాటి శివారెడ్డి. ఏ3 గా వాకాటి శ్రీనివాసులురెడ్డి. ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఈ కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.