అమరావతిలో 219వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ వెల్లడించింది. ఇందులో 51.56 శాతం వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించినట్లు ఎస్ఎల్బీసీ తెలిపింది.
కాగా 2021-22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం జగన్ వెల్లడించారు. వీరికి రుణాలు అందించడంపై బ్యాంకర్లు మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. సాగుచేస్తున్న కౌలు రైతుల్ని సులభంగా ఈ డేటా ద్వారా గుర్తించవచ్చని.. ఈ-డేటాను పరిగణలోకి తీసుకుని వారికి విరివిగా రుణాలు ఇచ్చి బ్యాంకర్లు అండగా నిలవాలని హితవు పలికారు. 2021-22లో ఎంఎస్ఎంఈలకు 90.55 శాతం రుణాలు ఇచ్చారని సీఎం జగన్ తెలిపారు. ఈ రంగంలో కూడా లక్ష్యం కంటే తక్కువగా రుణాలు ఇచ్చారని.. టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులతో బ్యాంకులు టైఅప్ కావాల్సి ఉందన్నారు.ఈ అంశంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు.
మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. వార్షిక రుణ ప్రణాళిక తయారీలో ప్రభుత్వాధికారుల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్దేశించుకున్న అంశాలకు వార్షిక ప్రణాళికలో చోటు దక్కతుందని తెలిపారు. ఆర్బీకేల్లో డ్రోన్లను తీసుకు వస్తున్నామని.. డ్రోన్ టెక్నాలజీకి బ్యాంకర్లు సహకారం అందించాలని సీఎం జగన్ కోరారు.