Sajjala Ramakrishna Reddy comments on chandrababu: వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. అంటూ ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. పరామర్శ కంటే ప్రచారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని.. చంద్రబాబు మురికి రాజకీయానికి గురువారం నాటి ఘటనే సాక్ష్యమన్నారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే తక్షణ సహాయక చర్యలు చేపట్టిన దాఖలాలే లేవని సజ్జల విమర్శించారు.
Read Also: South Central Railway: ప్రయాణికులకు గమనిక.. పలు మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్లు
ప్రస్తుతం వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఆసాంతం పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఏ ఒక్కరితో కూడా చెప్పించలేకపోయారని సజ్జల అన్నారు. సాయం అందలేదనే మాట ఒక్కరి నోటి నుంచి కూడా రాని పరిస్థితి కనిపించిందన్నారు. 40ఏళ్ల చంద్రబాబు అబద్ధపు రాజకీయ జీవితం ఆఖరి దశకు చేరిందని సజ్జల విమర్శలు చేశారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. ఈరోజు క్యాంప్ కార్యాలయంలో పార్టీలకు సంబంధించిన కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగిందని.. నిర్దేశిత కాలపరిమితిలో మండల కమిటీలు వేసుకోవాలని సీఎం జగన్ సూచించారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలతో నేరుగా జగన్ మాట్లాడతారన్నారు. గడప గడప మన ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు చేరవేస్తున్నామన్నారు. తమప్రభుత్వంలో లంచం అనేదే లేకుండా నేరుగా లబ్దిదారులకు డీబీటీల ద్వారా లబ్ది చేకూరుస్తున్నామని తెలిపారు. గతంలో ఏం జరిగింది.. ఈ మూడేళ్లల్లో ఏం జరిగిందనే అంశాన్ని బేరీజు వేసుకుంటే ప్రతి ఒక్కరూ జగన్ వైపే వస్తారన్నారు. ప్రభుత్వం చేస్తోన్న మంచిని ప్రజల వద్దకు తీసుకెళ్లేలా సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నామన్నారు. గత ప్రభుత్వం గ్రాఫిక్స్, మోసం ద్వారా మభ్య పెట్టిందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా ప్రతిపక్షం బురద జల్లుతోందని మండిపడ్డారు. బటన్ నొక్కగానే డబ్బులు ఖాతాల్లోకి వెళ్తున్నాయని.. ఈ తరహాలో బటన్ నొక్కే విధానం గతంలో ఎన్నడూ లేదన్నారు.