గుడిసె..ఇప్పుడు పర్యాటకుల ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్న పర్యటక ప్రాంతం..! తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలో ఉన్న ఈగ్రామానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అయితే విచ్చలవిడిగా రూల్స్ ఉల్లంఘించడంతో…. వచ్చే నెల 20 వరకు అనుమతిని నిలిపివేశారు. కాలుష్య నివారణ విషయంలో ఎలాంటి మినహాయింపులు వుండవంటున్నారు అధికారులు.
తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లిలో ఉన్న గుడిసె పర్యాటకుల సొంతం. పర్యాటకుల మదిని దోచే అందాలకొండ గుడిసె. దీని ప్రత్యేకతే వేరు. మారేడుమిల్లికే వన్నె తెచ్చిన వన దేవతకు కలికి తురాయిగా పేరొందిన ప్రాంతం ఇది. నిత్యం వేలాదిమంది వాహనాల్లో ఇక్కడికి తరలివస్తుండడంతో సందడిగా మారుతోంది. మారేడుమిల్లి పరిసరాల్లోని జలపాతాలు, పర్యాటక ప్రదేశాలను అటవీశాఖ ఆధ్వర్యంలో సీబీఈటీల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. పుల్లంగి పంచాయతీలోని ఈ కొండ తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ వ్యాప్తంగా ఖ్యాతి చెందింది.
అయితే ఇప్పుడు ఈపర్యాటక ప్రాంతానికి తాకిడి పెరడగంతో పర్యారణ ముప్పు ఏర్పడింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు చెత్త, చెదారాలను విచ్చలవిడిగా పడేస్తున్నారు. రాత్రులు మంటలు వేసుకోవడం, మద్యం సేవించిన బాటిల్స్ పగులకొట్టి పాడేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో అందాల కొండ గుడిసెకు పర్యావరణ ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో పర్యాటకులను మార్చి 20వ తేదీ వరకు నిలుపుదల చేశారు. గుడిసె పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకే ఈ చర్యలు చేపట్టారు.
గుడిసె అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకే రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. పీవో ప్రవీణ్ ఆదిత్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొండ కిందనున్న గుండ్రతి వద్ద కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రహదారి నిర్మించేందుకు గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఆద్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ, అటవీ, ఐటీడీఏ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి మార్చి 20వ తేదీ నుండి తిరిగి పర్యాటకులకు అనుమతి ఇవ్వనున్నారు.