ఓవైపు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుంటే.. మరోవైపు.. గిట్టు బాటు ధర లేక.. రైతులు పంటను ధ్వంసం చేసే పరిస్థితి నెలకొంది.. కర్నూలు జిల్లాలో ఉల్లి దిగుబడులు మొదలయ్యాయి. ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు తరలి వస్తోంది. దిగుబడి కూడా సంతృప్తికరంగానే ఉంది. అయితే ఉల్లి ధర పడిపోయింది. రైతుల నుంచి క్వింటాలు ఉల్లి 400 నుంచి 800 పలుకుతోంది. వినియోగదారులకు వ్యాపారులు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. ఉల్లి గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఎకరాకు 60 వేలకు పైగానే ఉందని, ఇప్పటి ధర పెట్టుబడికి కూడా రావడం లేదంటున్నారు. దళారులు ఉల్లి ధర రైతులకు దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Read Also: Colleague Hugging: కౌగిలించుకున్నాడంటూ కోర్టుకెక్కిన మహిళ.. భారీ జరిమానా విధించిన న్యాయమూర్తి..
కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతుంది. ఇతర రాష్ట్రాలకు కర్నూలు జిల్లా నుంచి ఉల్లి ఎగుమతవుతుంది. రైతులకు ఎప్పుడో ఒకసారి కానీ మంచి ధర దక్కదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత ధర పడిపోతుందేమోనన్న భయం రైతుల్లో ఉంది. ఇప్పటికే కర్నూలు మార్కెట్కు రోజుకు 1300 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. కనిష్ట ధర 415 కాగా గరిష్ట ధర 1150 వుంది. గరిష్ట ధర దక్కేది ఏ ఒకరిద్దరు రైతులకు మాత్రమే దక్కుతుంది. మెజారిటీ రైతులకు దక్కేది 800 రూపాయల లోపే.. ఉల్లి గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంటను తొలగిస్తున్నారు. దేవనకొండ మండలంలో ఓ రైతు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని ఉల్లి సాగు చేసాడు. పండిన ఉల్లిని కోసి, గ్రేడింగ్ చేసి, ట్రాక్టర్ లో మార్కెట్ కు తరలిస్తే.. కూలీలు, రవాణా ఖర్చు కనీసం 3 లక్షలు వ్యయం అవుతుంది. మార్కెట్ లో సరుకు అమ్మితే 2 లక్షలు కూడా చేతికి రాదు. దీంతో 12 వేలు ఖర్చు పెట్టి ఉల్లి పంటను ట్రాక్టర్ తో దున్నించాడు. ఉల్లిపంట అత్యధికంగా సాగు చేసేది కర్నూలు జిల్లాలోనే. గిట్టుబాటు ధర కల్పించాలని ప్రతి ఏటా రైతులు కోరుతూనే ఉన్నారు. నష్టపోతూనే వున్నారు. ఇప్పటికైనా ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.