ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సహనం పరీక్షించొద్దంటూ పవన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న మమ్మల్ని రాక్షసులు.. దుర్మార్గలంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడ్డం సరికాదని, వైసీపీ చేసిన తప్పిదాలనే జనసేన మాట్లాడుతోందనే విషయాన్ని వైసీపీ అగ్ర నాయకత్వం తెలుసుకోవాలన్నారు. నేనూ వైసీపీ నేతల కంటే బలంగా మాట్లాడగలనని, నేను విధానాలపైనే మాట్లాడుతున్నానని.. వైసీపీ అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ వ్యక్తిగత దూషణలకు దిగితే.. ఏ సమయంలో ఎంతివ్వాలో అంతిచ్చేస్తానని ఆయన హెచ్చరించారు. నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడి.. మా సహనాన్ని వైసీపీ పరీక్షించొద్దని, ప్రజలను పల్లకి ఎక్కించేందుకే జనసేన పని చేస్తుందని, జనసేనకు వ్యక్తిగత అజెండాలు ఉండవని ఆయన వెల్లడించారు.
అధికారంలోకి రాకముందు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక అల్పాదాయ వర్గాలపై 57 శాతం విద్యుత్ ఛార్జీల పేరుతో భారం మోపుతోందన్నారు. వైసీపీ మాటలకు అర్థాలే వేరులే అన్నది నిరూపితమవుతోందని, కుడి చేత్తో ఇచ్చి.. ఎడం చేత్తో లాగేసుకుంటోంది ఇదే ప్రభుత్వ విధానమని ఆయన మండిపడ్డారు. గతంలో నా దృష్టికి వచ్చిన విద్యుత్ సంబంధిత సమస్యలు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. వాటిని నాటి ప్రభుత్వం పరిష్కరించిందని, పల్లెల్లో 11 గంటల నుంచి 14 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారన్నారు.
పట్టణాల్లో ఐదు నుంచి ఆరు గంటల పాటు కోతలు, నగరాల్లో నాలుగు నుంచి ఆరు గంటల పాటు కోతలు, ఆస్పత్రుల్లో కూడా విద్యుత్ కోతలు ఉంటున్న పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం వల్ల కార్మికుల ఆదాయానికి గండి పడుతోందన్నారు. అప్పులతో పరిశ్రమలు నడుపుతున్న పారిశ్రామిక వేత్తలకు పవర్ హాలిడే శరాఘాతమేనని ఆయన వ్యాఖ్యానించారు.