నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది కాదని పవన్ హితవు పలికారు. ఇలాంటి విపత్కర సమయంలో సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేయడంపై చూపించిన శ్రద్ధ ఏ విధంగా హేతుబద్ధమో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సి ఉందని పవన్ తీవ్రస్థాయిలో స్పందించారు.