Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు (Environmental Clearances – ECs) లేకుండా ప్రాజెక్ట్లను ప్రారంభించి, ఆ తర్వాత ‘పోస్ట్-ఫాక్టో’ అనుమతులు పొందే ధోరణికి సుప్రీంకోర్టు విరామం ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986లోని సెక్షన్ 3 కింద చట్టబద్ధమైన గెజెట్ నోటిఫికేషన్ ద్వారా పరిమితంగా ప్రాజెక్ట్లను క్రమబద్ధీకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, కేవలం ఒక సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మెమోరాండమ్ (OM) ద్వారా ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండా పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు తదనంతరం అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన ఆఫీస్ మెమోరాండంను ధర్మాసనం కొట్టివేసింది. 2006 నోటిఫికేషన్ ప్రకారం ముందస్తు అనుమతి పొందే ప్రక్రియను ఒక చట్టబద్ధమైన నోటిఫికేషన్ ద్వారా మాత్రమే సవరించగలరని, సాధారణ పరిపాలనా ఉత్తర్వుల ద్వారా దాన్ని మార్చడం చట్ట విరుద్ధమని జస్టిస్ బాగ్చీ స్పష్టం చేశారు. 2021 మెమోరాండం పర్యావరణ పరిరక్షణ చట్ట నిబంధనలకు, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందంటూ దాన్ని పక్కనపెట్టింది.
గతంలో ‘కామన్ కాజ్’, ‘అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్’ కేసుల్లో ఇచ్చిన తీర్పులపై కోర్టు ఈ సందర్భంగా స్పష్టతనిచ్చింది. ఆ తీర్పుల్లో పోస్ట్-ఫాక్టో అనుమతులు పర్యావరణ సూత్రాలకు వ్యతిరేకమని చెప్పిన అంశం, అప్పట్లో ఉన్న 2006 EIA నోటిఫికేషన్ చట్టబద్ధమైన సరిహద్దుల నేపథ్యంలోనే చూడాలని పేర్కొంది. అత్యవసర ప్రజారోగ్య, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పక్కాగా రూపకల్పన చేసే అమనెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ప్రవేశపెట్టే అధికారాన్ని ఆ తీర్పులు ఏమాత్రం అడ్డుకోవని వివరించింది. ఇదే కోవలో ‘పహ్వా ప్లాస్టిక్స్’, ‘డి స్వామి’ కేసుల్లో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమీక్షించింది. పర్యావరణ ఉల్లంఘనలను పరిష్కరించేందుకు 2017లో ఇచ్చిన చట్టబద్ధమైన నోటిఫికేషన్ను సమర్థించిన అంశంలో ఆ తీర్పుల వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. అయితే, 2021 ఆఫీస్ మెమోరాండంను సమర్థించినంత మేర ఆ తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2017 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం వచ్చిందని, కానీ 2021 OM కేవలం ఒక పరిపాలనా ఉత్తర్వు మాత్రమేనని స్పష్టం చేసింది. పైగా ఇది ఎలాంటి అనుమతులైనా ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చనే ఒక శాశ్వత వ్యవస్థను తయారు చేసేలా ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read
- Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
- Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
- 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
అయితే, పర్యావరణ భద్రతతో పాటు ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్ట్లను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ తీర్పును ‘భవిష్యత్తుకే వర్తించేలా (Prospective effect)’ వర్తింపజేసింది. 2017 నోటిఫికేషన్ మరియు 2021 OM కింద ఇప్పటికే మంజూరు చేసిన పర్యావరణ అనుమతులను రక్షించింది. ప్రత్యేకంగా చట్టబద్ధంగా సవాలు చేస్తే తప్ప ఆ అనుమతులు చెల్లుతాయని తెలిపింది. అదే సమయంలో, ఈ రెండింటి కింద ఇకపై కొత్త దరఖాస్తులను స్వీకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన నోటిఫికేషన్ కాకుండా సులభమైన దారిలో ఆఫీస్ మెమోరాండమ్లతో ముందస్తు అనుమతుల నియమాన్ని నీరుగార్చడం కుదరదని చెబుతూనే, ఒకవేళ కేంద్రం అలాంటి విధానం తేవాలనుకుంటే పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 3 ప్రకారం గెజెట్ నోటిఫికేషన్ ద్వారానే చేపట్టాలని వెల్లడించింది.
ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే… మే 2025లో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ‘వనశక్తి’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతూ, భవిష్యత్తులో పోస్ట్-ఫాక్టో అనుమతులను పూర్తిగా నిషేధించింది. అయితే నవంబర్ 2025లో సీజేఐ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (భిన్నమైన తీర్పు)లతో కూడిన మరో ధర్మాసనం పాత తీర్పు ఇతర పూర్వపరాలకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంటూ ఆ ఉత్తర్వులను ఉపసంహరించి, కేసును మళ్లీ తాజా విచారణకు పంపింది. ఆ తర్వాత సీజేఐ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సమగ్రంగా విచారించి, ఏప్రిల్ 1, 2026న తీర్పును రిజర్వ్ చేసింది.
విచారణ సమయంలో ‘వనశక్తి’ సంస్థ తరఫు న్యాయవాదులు వాదిస్తూ… 2021 జూలై 7 నాటి ఆఫీస్ మెమోరాండమ్ సృష్టించిన ప్రామాణిక నిర్వహణ విధానం (SOP) రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు పొంది సరిగ్గా నడిచే ప్రాజెక్ట్లకు ఇది తీవ్ర అన్యాయం చేస్తుందని, ఉల్లంఘనులను సులభంగా తప్పించేలా ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దీనిని సమర్థిస్తూ… ఇది ఉల్లంఘనదారులకు మినహాయింపులు ఇచ్చే విధానం కాదని, అనుమతులు లేని ప్రాజెక్ట్ల వల్ల జరిగిన పర్యావరణ నష్టాన్ని అంచనా వేసి, వారికి భారీ పరిహారం, జరిమానాలు విధించి, EIA 2006 కింద కఠినంగా మూల్యాంకనం చేశాకే భవిష్యత్ అనుమతులు ఇచ్చే ఒక మార్గమని వాదించింది. అయితే, ఒక సాధారణ ఆఫీస్ మెమోరాండమ్ ఆధారంగా ప్రాజెక్ట్లను నడవనిస్తే ముందస్తు పర్యావరణ అనుమతి అనే ప్రాథమిక నియమానికే అర్థం లేకుండా పోతుందనే కోణాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
-
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
-
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
-
Clicky Ponting: ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ చేసింది ఇతగాడే.. వివాదంలో కొత్త ట్విస్ట్.. భారతీయ స్పాన్సర్షిప్ గుడ్బై!
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
ట్రెండింగ్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!