ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాలడుగు ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముఠాను పట్టుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరులో మేడికొండూరు పీఎస్ పరిధిలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లికి చెందిన ఓ జంటపై 8 మంది ముఠా సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో భర్తను కొట్టి అతడి ముందే భార్యను సామూహిక అత్యాచారం చేశారు. తాజాగా ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ముఠా చాలా డేంజరస్ అని… 18 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. బైకులపై వెళ్తున్న జంటలపై దాడి చేయడమే ఈ ముఠా పని అన్నారు. ఈ దాడులకు పాల్పడేముందు ఆయా ప్రాంతాలను రెక్కీ చేస్తారన్నారు.
Read Also: మంచులో కూరుకుపోయి 22 మంది పర్యాటకులు మృతి
నిందితులు సాధారణ సమయంలో మిర్చి పొలాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కూలీ పనులు చేసుకుంటారని జిల్లా ఎస్పీ తెలిపారు. గుంటూరు రూరల్ పరిధిలో ఆరు కేసులు.. అర్బన్ పరిధిలో 18 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీరు మెయిన్రోడ్డుపై అసలు ప్రయాణించరని… అందుకే సీసీ కెమెరాల్లో ఎక్కడా ముఠా కదలికలు రికార్డు కాలేదన్నారు. ఈ ముఠా సభ్యులది కర్నూలు జిల్లా పాణ్యం అని.. వీరు ఎక్కువగా రైలులోనే ప్రయాణిస్తారన్నారు. మొత్తం 30 మంది పోలీస్ సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.73 లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.