విజయవాడలో మరోసారి కలకలం రేగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పుల వాళ్లు బాకీలు ఇవ్వాలని పోరు పెడుతుండటంతో ఏం చేయాలో తెలియక వెంకటేశ్వరరావు కుటుంబం విజయవాడకు వచ్చి లాడ్జీలో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అయితే సూసైడ్ చేసుకునేముందు వాళ్లు తమ కుటుంబసభ్యుల్లో ఒకరికి మెసేజ్ చేశారు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ ద్వారా కుటుంబీకులకు చెప్పడంతో వాళ్లు వెంటనే స్పందించి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే లాడ్జీకి చేరుకుని వెంకటేశ్వరావు కుటుంబసభ్యులను రక్షించారు. వాళ్లు విషం తాగడంతో పోలీసులు ఉప్పునీరు తాగించి విషాన్ని బయటకు కక్కించే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా గతంలోనూ విజయవాడలో దుర్గమ్మ దర్శనానికి వచ్చి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.