ఓ వైపు విశాఖ గర్జన.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. దీంతో, విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై జనసేన శ్రేణులు దాడి చేసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.. అయితే, దీనిపై స్పందించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్.. విశాఖ ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.. అసలు మంత్రుల కార్ల మీద దాడి జరిగినట్లు గానీ, అది జనసేన వాళ్లు చేసినట్లు గానీ, పోలీస్ శాఖ నిర్ధారించలేదన్న ఆయన.. ఇది కేవలం వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మాత్రమే అన్నారు.. ఇక, దాడి సంస్కృతి మా పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదన్న ఆయన… ఆ విద్యలో వైసీపీ వాళ్లు ఆరితేరిపోయారని ఫైర్ అయ్యారు.
Read Also: Minister Gudivada Amarnath: పవర్ స్టార్ కాదు.. ఫ్లవర్ స్టార్.. వాళ్లు జన సైనికులా..? జన సైకోలా..?
విశాఖ విమానాశ్రయంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోడి కత్తి హడావిడి చేశారు. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదన్నారు నాదెండ్ల మనోహర్.. ఇప్పుడు అదే పంథాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక పవిత్ర పదవిలో ఉన్న పెద్దాయన మీద దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని… మంత్రుల మీదే దాడి జరిగితే వాళ్లకు రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నట్లు? అలా జరిగితే అది కచ్చితంగా పోలీసు శాఖ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుందన్నారు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటనకు భారీ జన సందోహం వచ్చింది… రేపటి జనవాణి కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్లించేందుకే వైసీపీ కొత్త నాటకానికి తెర తీసింది అని ఆరోపించారు. విశాఖవాసులకు, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెలుసు? మంత్రుల కాకమ్మ కథలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు మనోహర్.
ఇదే సమయంలో జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్కు తగినంత బందోబస్తు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశామని తెలిపారు నాదెండ్ల మనోహర్.. అదే విధంగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కు మా పార్టీ నేతలు లేఖ ఇచ్చారు. అయినా తగిన విధంగా స్పందించలేదు. నామ మాత్రంగానే పోలీసు సిబ్బందిని కేటాయించడం వెనక అధికారులపై ఒత్తిడి ఉన్న విషయం అర్థమవుతోందని… అదే విధంగా పవన్ కళ్యాణ్… జనసేన పార్టీ శ్రేణులతో ఊరేగింపుగా వస్తుంటే వీధి దీపాలు వెలగకుండా పవర్ కట్ చేశారు అంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ప్రజలు గ్రహించాలన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్.