శీతకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యా సభలో జీరో అవర్లో కడప జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. టెక్స్టైల్ పార్క్ ఆవశ్యకతను వివరించారు. కొప్పర్తిలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 4,445 కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా ఏడు “మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్”, “అప్పరెల్ పార్కు” (మిత్రా) చేయాలని నిర్ణయించిందని దీన్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కడపజిల్లాలోని కొప్పర్తిలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన “మిత్రా” పార్కు ద్వారా స్పిన్నింగ్, డైయింగ్, ప్రింటింగ్ వంటి ప్రక్రియలు ఒకే చోట చేపట్టే వీలుందన్నారు. దీని ద్వారా టెక్స్టైల్ వాల్యూ చైన్ యావత్తు ఒకే చోట సమీకృతమై ఉంటుందని సభలో పేర్కొన్నారు. “మిత్రా” పార్కులలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన అవకాశం ఉందన్నారు.
also read:సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్లను ఏర్పాటు చేయాలి: వేంరెడ్డి ప్రభాకర్రెడ్డి
ఫలితంగా రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఈ పార్కులు ఏర్పాటు వల్ల దేశియంగా, అంతర్జాతీయంగా టెక్స్టైల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోకి కొప్పర్తిలో ఇప్పటికే అనేక టెక్స్టైల్ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం “మెగా ఇండస్ట్రియల్ హబ్”ను ఏర్పాటు చేసిందని సభకు వివరించారు. మిత్రా పార్కు అభివృద్ధికి అవసరమైన రోడ్డు, రవాణా వంటి మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాంతం పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలను ప్రకటించి ఈ ప్రాంతాన్ని పెట్టుబడిదారుల అనుకూల ప్రాంతంగా ప్రోత్సాహిస్తోందన్నారు. దేశంలో కాటన్, సిల్క్ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది నిపుణులైన హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్మికులు ఉన్నారని తెలిపారు. “మిత్రా” పార్క్ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఏకైక నోడల్ పాయింట్గా అభివృద్ధి చెంది, సరఫరా సమీకృతం కావడానికి దోహదపడుతుందని సభలో విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.