MLA Quota MLC Elections: ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.. గురువారం రోజు దీనికి సంబంధించిన పోలింగ్ నిర్వహించడంతో పాటు సాయంత్రం ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.. అయితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. ఏపీ వైసీపీ ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టేసింది.. అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా..? అని జిల్లాల్లో ఆరా తీసింది.. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిలక బరిలో టీడీపీ అభ్యర్థిని నిలపడంతో.. ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారింది..
టీడీపీ అభ్యర్థిని పెట్టడంతో వైసీపీ నుంచి ఒక్క ఓటు చేజారినా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార పక్షం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.. అయితే, ఆత్మ ప్రభోదానుసారం ఓటేస్తామంటూ రెబల్ ఎమ్మెల్యేలుగా ముద్రపడిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటించారు.. వీరితో పాటు అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? అని కూడా ఆరా తీసింది వైసీపీ.. మొత్తంగా రేపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా.. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. అసెంబ్లీ ప్రాంగణంలోని మీటింగ్ హాల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు..
ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. బరిలో 8 మంది అభ్యర్థులు ఉన్నారు.. బరిలో ఉన్నవారిలో వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు.. ఈ ఎన్నికల్లో 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల కమిషన్ యంత్రాంగం.. పోలింగ్ నేపథ్యంలో రేపు అసెంబ్లీ లోకి విజిటర్స్ కు అనుమతులు రద్దు చేశారు.. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు అధికార, ప్రతిపక్ష పార్టీలు.. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో 3కి 3 స్థానాలు అధికార పార్టీ చేజార్చుకున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకంగా మారిపోయాయి.. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేల ఓట్లు ఇప్పుడు కీలకంగా మారిపోయాయి.. కీలక ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక్కొక్కరికి 22 మంది సభ్యులను అప్పగించింది వైసీపీ.. అప్పగించిన సభ్యులు ఓటు వేసే బాధ్యత మంత్రులదే అని సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా మాక్ పోల్ కూడా నిర్వహించారు.. మొత్తంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి..