MLA Kannababu Sensational Comments On Chandrababu Naidu Manifesto: మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాకినాడలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రాజమండ్రిలో మహానాడు అనే డ్రామా కంపెనీని నడిపాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్కు నైతిక విలువలు లేవని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అదే ఎన్టీఆర్ను శకపురుషుడు అంటూ కీర్తిస్తున్నాడని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టోను తీసుకువచ్చి.. తన మేనిఫెస్టోగా చంద్రబాబు చెప్తున్నాడని ఆరోపించారు. దేవుడు చంద్రబాబుకి సిగ్గు పెట్టలేదన్న ఆయన.. మహానాడులో పొత్తుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి.. బీజేపీకి కన్నుకొడుతున్నాడని ధ్వజమెత్తారు.
Kakani Govardhan Reddy: చంద్రబాబు రాయి వేశారే తప్ప.. చేసిందేమీ లేదు
అంతకుముందు కూడా.. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కన్నబాబు వ్యాఖ్యానించారు. సభల్లో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని, చంద్రబాబు పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దేవుడు మతిమరుపు అనే వరం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక నారా లోకేష్ పెద్ద ఐరన్ లెగ్ అని ప్రజలు అనుకుంటున్నారని.. వీళ్ల ప్రచారయావతో నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో అమాయకులను పొట్టన పెట్టుకున్నారనని మండిపడ్డారు. పుష్కరాల్లో కూడా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అయ్యారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, సీఎం జగన్ ప్రతి పేదవాడి గుండె చప్పుడు వింటున్నారని పేర్కొన్నారు. టీడీపీకి బలం లేకనే మిగిలిన పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.
Gudivada Amarnath: ఉన్నమాట అంటే ఉలుకెందుకు.. ఫ్లెక్సీ వివాదంపై మంత్రి అమర్నాథ్ రియాక్షన్