తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో మంత్రి హోదాలో శాప్పై మంత్రి రోజా తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే శాప్ సమావేశంలో రోజా సెల్ఫోన్స్ గురించి ప్రస్తావించిన సమయంలో.. ఆమె సెల్ఫోన్ చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. కాగా మంత్రి రోజా సెల్ఫోన్ చోరీ చేసిన వ్యక్తి ఎవరన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
కాగా శాప్ సమీక్ష సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ను ముందుకు తీసుకువెళ్లాలనేది సీఎం జగన్ ఆలోచనగా ఉందని తెలిపారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా తెలిపారు. క్రీడల్లో సరైన ప్రోత్సాహం లేకపోవడంతో యువతీ యువకులు వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
జీవితంలో స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యమని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. సెల్ ఫోన్స్ వల్ల చాలామంది స్పోర్ట్స్కు దూరం అవుతున్నారన్నారు. పిల్లలు చిన్న విషయాలకు డిప్రెషన్ అవుతున్నారని.. వాళ్లు చాలా సెన్సిటివ్గా మారుతున్నారని తెలిపారు. స్పోర్ట్స్ ఆడటం వల్ల మానసిక స్థైర్యం వస్తుందని మంత్రి రోజా అన్నారు. ఫైర్ అనేది ఇన్ బిల్ట్ అని.. చెడు మీద ఫైర్ అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. తానెప్పుడూ సీఎం జగన్ను ఫాలో అవుతానని స్పష్టం చేశారు. మనం చేసే అభివృద్ధి పనులే మనల్ని విమర్శించే వాళ్లకు సమాధానం చెప్తాయని రోజా వ్యాఖ్యానించారు. అంతకుముందు తిరుపతి ఎస్వీయూ ఆవరణలోని వెంకటేశ్వరస్వామిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి రోజాకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Andhra Pradesh: ఒంగోలు ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్పై సీఎం జగన్ సీరియస్