ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు జగన్ దావోస్ వెళ్లారని ప్రభుత్వం నిన్న ప్రకటించింది. అయితే సీఎం జగన్ దావోస్ వెళ్లలేదని నేరుగా లండన్ వెళ్లారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపీకి, ఎల్లో మీడియాకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందని.. కనీస విలువలను పాటించాలన్న స్పృహ కోల్పోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి నుంచి ముఖ్యమంత్రి కుటుంబానికే కాదు, రాష్ట్రానికి కూడా ముప్పు మరింత పెరిగిందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ దావోస్ పర్యటనపై యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. వయసు మీద పడుతున్న కొద్దీ యనమల కనీస సంస్కారం లేకుండా దిగజారి పోతున్నారని.. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారికి కూడా విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనల మీద అవగాహన లేకపోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు. దాపరికం, దొంగ దారుల్లో అధికారం సాధించడం, ప్రజల్ని వంచించడం టీడీపీ ట్రేడ్ మార్క్ అని బుగ్గన విమర్శలు చేశారు. సీఎం పర్యటన రహస్యమేమీ కాదని.. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదని క్లారిటీ ఇచ్చారు.
శుక్రవారం నాడు గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్లో ఆగిందని.. ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగిందని బుగ్గన తెలిపారు. దీని వల్ల లండన్ ఎయిర్పోర్టుకు చేరుకున్నప్పుడు ఆలస్యం అయ్యిందని.. లండన్లో కూడా ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా ఉండటంతో జురెక్లో ల్యాండ్ అవడానికి ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందని.. మళ్లీ ల్యాండింగ్ కోసం అధికారులు రిక్వెస్ట్ పెట్టారని వివరించారు. ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్లోని భారత ఎంబసీ అధికారులు కూడా పాల్గొన్నట్లు బుగ్గన తెలిపారు. అయితే రాత్రి 10 గంటల తర్వాత జురెక్లో విమానాల ల్యాండింగ్ను చాలా కాలం నుంచి నిషేధించారని.. ఈ విషయాన్ని స్విస్ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారని పేర్కొన్నారు.
ఈ విషయాలన్నీ స్విట్జర్లాండ్ లోని భారత ఎంబసీ అధికారులు లండన్లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారు. వారు అధికారులతో చర్చించి.. లండన్లోనే సీఎం జగన్కు బస ఏర్పాటు చేశారని బుగ్గన తెలిపారు. శనివారం తెల్లవారుజామునే జురెక్ బయలుదేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధమైందని.. పైలట్లు నిన్న అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని బుగ్గన వివరించారు. నిజాలు ఇలా ఉంటే సీఎం మీద అసూయతో, ద్వేషంతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారని.. దిగజారిపోవడంలో మరో మైలు రాయిని టీడీపీ అందుకుందని బుగ్గన ఎద్దేవా చేశారు. శనివారం సాయంత్రం కల్లా సీఎం జగన్ దావోస్ చేరుకుంటారని బుగ్గన స్పష్టం చేశారు.