ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు మావోయిస్టు పార్టీ నేత గణేష్.. వైసీపీ రెండేళ్ల పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. జగన్ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. అవినీతి కేసులు ఉన్న జగన్ కేంద్రానికి తలొగ్గి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని… రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ తన లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్.. అవినీతి కేసులతో తలొగ్గారు.. మోడీ, షాలకు మోకరిల్లారని ఆరోపించిన ఆయన.. జగన్ తను అరెస్టు కాకుండా చూసుకుంటున్నారని మండిపడ్డారు..
రెండేళ్ల పాలనలో మౌలిక వసతుల కల్పనలో విఫలం అయ్యారని విమర్శించింది మావోయిస్టు పార్టీ.. అన్నింటి నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే మూడు రాజధానులు తెరపైకి తెచ్చారని ఆరోపించిన మావోయిస్టు నేత గణేష్.. విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ ఆమోదం తెలిపారని.. పైకి మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తున్నారని పేర్కొన్నారు.. కేసులతో పత్రికా స్వేచ్ఛ హరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నిరంకుశ, అప్రజాస్వామిక పద్ధతులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం.. ఈ ఉద్యమంలో ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు గణేష్..