CM Chandrababu: తాను 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుని తప్ప, 2014 నాటి చంద్రబాబు కాదని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. చేసిన తప్పులను సరిదిద్దడం ఒక సమస్య అయితే, వాటిని చేసిన వారిని ఎదుర్కోవడం మరో సమస్య అని పేర్కొన్నారు.. కర్నూలు పర్యటనలో బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మామిడి కాయలు తెచ్చి రోడ్లపై పడేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో బలప్రదర్శన చేయాలని, కానీ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భద్రత ఉండాలా లేదా అన్నది ఆలోచించాలని హెచ్చరించారు. రాయలసీమను ప్రపంచానికి హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు. ముచ్చుమర్రి, పోతురెడ్డిపాడు ఉన్నప్పటికీ డబ్బుల కక్కుర్తితో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ తెచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అనుమతులు లేకపోవడంతో ఎన్జీటీ పనులు నిలిపివేస్తే తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: చిచ్చరపిడుగు Vaibhav Sooryavanshi విశ్వరూపం.. ఫైనల్ లో సెంచరీ.. బద్దలైన రికార్డ్స్ ఇవే!
పశ్చిమ ప్రాంతాలకు నీళ్లు రావాలంటే వేదవతి ప్రాజెక్టు పూర్తి కావాలని, తుంగభద్ర నీటిని కర్నూలు జిల్లా ఎక్కువగా వినియోగిస్తే కరువు సమస్య తీరుతుందని తెలిపారు చంద్రబాబు.. ఆర్డీఎస్ కుడి కాలువపై వర్కౌట్ చేస్తామని, గుండ్రేవుల అంతర్రాష్ట్ర సమస్యపై తెలంగాణ, కర్ణాటక, ఏపీతో చర్చించి త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. వేదవతి ప్రాజెక్టుకు రూ.1942 కోట్లు ఖర్చవుతాయని, ఇప్పటివరకు 16 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. తీవ్రవాదులతో పోరాడిన సందర్భంలో తనపై 24 క్లేమోర్ మైన్స్ పేల్చారని చంద్రబాబు వెల్లడించారు. అయినా వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని చెప్పారు. ఇక, వివేకానంద రెడ్డి హత్య కేసులో తనపై అనవసరంగా నరాసుర రక్త చరిత్ర అంటూ రాశారని, ఇప్పుడు తనను అపాలజీ చెప్పమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లడానికి 6 గంటలు పడుతోందని, ఆ రోడ్డుపై ఇంకెవరూ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. రౌడీయిజం, గుండాయిజం చేస్తూ బలప్రదర్శన చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు చంద్రబాబు.. ఇక, టెక్నాలజీ ఇప్పుడు గేమ్చేంజర్గా మారిందన్నారు. పింఛన్లకు ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ పథకాలపై ప్రజలకు నేరుగా ఫోన్లు చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు జిల్లాలో 65 శాతం మంది పరిస్థితి బాగుందని చెప్పారని వెల్లడించారు. అధికారులు సమర్థత పెంచుకుంటే వారితో ఉంటానని స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం, నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. పేదరికం నిర్మూలన లక్ష్యంగా పని చేస్తామని, రాయలసీమలో ఏరోస్పేస్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు..