Gudivada Software Engineer Murder: కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రాంతానికి చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుడివాడ బేతవోలు గ్రామానికి చెందిన బండ్ల ఋషికేష్ (27) హర్యానాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందినట్లు సమాచారం. ఋషికేష్ ఇటీవలే హర్యానాలోని పంచకులలో ఉన్న అమరావతి ఎన్క్లేవ్లోని ఒక ప్రైవేట్ ఐటీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం వచ్చిన పది రోజులు కూడా పూర్తికాకముందే ఈ దారుణం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
Read Also: Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు
కంపెనీ ఏర్పాటు చేసిన నివాస గదిలోనే ఋషికేష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం గుడివాడ వన్టౌన్ పోలీసులు బాధిత కుటుంబానికి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే ఋషికేష్ తండ్రి హుటాహుటిన హర్యానాకు బయలుదేరినట్లు తెలిసింది. యువకుడు కొత్తగా ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే ఇలా హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.