స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 4న ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొననున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఏపీలోని పలువురు ప్రముఖులకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆహ్వానాలు పంపుతున్నారు. కిషన్రెడ్డి ఆహ్వానం పంపిన వారి జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు.
Read Also: Live : నిన్ను కూడా ఇలాగే కత్తులతో… ప్రధాని మోడీకి వార్నింగ్..!
ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్వయంగా ఆహ్వానించడంతో చిరంజీవి కూడా భీమవరంలో జూలై 4న నిర్వహించే సభలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు. దీంతో ఒకే వేదికగా మోదీ, జగన్, చిరంజీవిలను చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. కాగా జూలై 4న ప్రధాని మోదీ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భీమవరంలోని స్ధానిక ఏఎస్ఆర్ పార్కులో ఏర్పాటు చేస్తున్న 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. జూలై 3న హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ ఆ రాత్రికి అక్కడే బస చేసిన జూలై 4న ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భీమవరం వెళ్లనున్నారు.