ఏపీలో రాజధాని రగడకు తెరపడినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో విచారించిన హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. పెద్దవాడిగా సీఎం జగన్కు చెబుతున్నా, జరిగింది జరిగిపోయింది.. ఇకనైనా అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటిస్తే సీఎం జగన్ గౌరవం కొంతైనా పెరుగుతుందని ఆయన అన్నారు.
హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం కొత్త ఎత్తులు వెయ్యొద్దని, అమరావతిపై ప్రోగ్రస్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. న్యాయస్థానం, దేవస్థానం అమరావతి రైతులకు అండగా నిలిచాయని, రేపు కేంద్ర మంత్రి షెకావత్ కు నిర్మాణం పూర్తికాని పోలవరం నిర్వాసిత కాలనీలు చూపిస్తే నిధులు వస్తాయని ఆయన అన్నారు. అంతేకాకుండా 155 అడుగుల ఎత్తులోనే పోలవరం పూర్తి చేసేలా నిధులు కేటాయించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.