Jogi Ramesh: మంగళగిరిలో మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసు విచారణ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో తిట్టారు.. అందుకే నేను చంద్రబాబు దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయాలని వెళ్లాను.. నిరసన తెలుపుతున్న నాపై దాడి చేసారు.. రాజకీయాల్లో విలువలు, విశ్వస నీయత అవసరం.. ప్రజలు మంచి విజయాన్ని ఇచ్చారు.. పాలకులు కక్షపూరిత వాతావరణంలో రాజకీయాలు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు అని ఆయన పేర్కొన్నారు. వివాదాస్పద భూములు కొనాలని ఎవరూ అనుకోరు.. అభం శుభం తెలియని నా కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి ఆనంద పడుతున్నారు అంటూ మాజీ మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు.
ఇక, రాజకీయ కోపాలు ఉంటే నా మీద తీర్చుకోండి అని జోగి రమేశ్ పేర్కొన్నారు. పిల్లలు జోలికి వెళ్ళడం సరి కాదు.. మీకు అనుమానాలు ఉంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల దగ్గరకు వచ్చి అనుమానాలు తీరుస్తా.. అంతేకాని రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదు.. 2002 నుంచి నేను ఒకే నంబరు వాడుతున్నా.. పోలీసులు అడిగిన ఏ సమాచారం అయినా ఇస్తా.. పరుష పదజాలం వాడిన మా పరిస్థితి ఏమయ్యిందో.. ఇప్పటి పాలకుల పరిస్థితి అదే అవుతుంది అని మాజీ మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు.