ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు.. వారి ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తుండగా.. ఇప్పుడు జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది.. నిరుద్యోగులకు అండగా జనసేన పోరాటం చేస్తుందని ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను జాబ్ క్యాలెండర్లో చేర్చాలని డిమాండ్ చేసిన జనసేనాని… లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని.. సుమారు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.. ఇక, ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారన్న పవన్ కల్యాణ్.. కానీ, జాబ్ క్యాలెండర్లో కేవలం 10 వేల ఉద్యోగాలను మాత్రమే చేర్చారని.. గ్రూప్-1, గ్రూప్-2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపారని ఆవేదన వ్యక్తం చేశారు.. నిరుద్యోగుల ఆందోళనకు జనసేన పార్టీ బాసటగా ఉంటుందని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.