దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో మార్చి 4 నుంచి ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా అల్పపీడనం కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు పడతాయనే అంచనాతో రైతుల్లో ఇప్పటి నుంచే ఆందోళన మొదలైంది.