Ambati Rambabu Cases: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నతే, మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైలుపాలయ్యారు. తర్వాత వరుసగా రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 33 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో తనపై నమోదైన కేసుల వ్యవహారంలో అంబటి న్యాయపోరాటం మొదలుపెట్టారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులను కొట్టెయ్యాలంటూ అంబటి హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ఈ కేసుల్లో ప్రొసీజర్ ఫాలో అవ్వాలని, తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు సూచించింది. ఇదే సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సందర్బంగా పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ పై రాజమండ్రి జైలులో ఉన్న అంబటిని గుంటూరు కోర్టులో హాజరుపర్చారు.
ఈ కేసులో కోర్టు రిమాండ్ విధించడంతో అంబటి జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ అంబటి తరపు న్యాయవాదులు గుంటూరుస్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలల క్రితం నమోదైన కేసులో ఇప్పుడు పీటీ వారెంట్ వెయ్యడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ 41ఏ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పోలీసులు హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని వాదనలు వినిపించారు. దీంతో బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని బుధవారం ప్రకటిస్తామని కోర్టు చెప్పింది. ఇదే సమయంలో అంబటిని విచారణకోసం కస్టడీకి ఇవ్వాలంటూ ప్టటాభిపురం పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా కోర్టులో విచారణ జరిగింది. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు కస్టడీ పిటిషన్ పై కూడా నిర్ణయాన్ని బుధవారం వెలువరిస్తామంది. జైలులో అంబటి రాంబాబుకు వసతులు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ పై కూడా బుధవారమే తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో గుంటూరు స్పెషల్ కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. స్పెషల్ కోర్టు అంబటికి బెయిల్ ఇస్తే రాంబాబు జైలునుంచి బయటకు వస్తారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను అంగీకరిస్తే అంబటి బయటకు రావడం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.