అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాజీ సీఎం చంద్రబాబును గ్రూప్-1 అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్-1 నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. 2018 గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని.. ఏపీపీఎస్సీ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్లో 62శాతం వ్యత్యాసం ఉందన్నారు. డిజిటల్ మూల్యాoకానం, మాన్యువల్ మూల్యాంకనంలో 62 శాతం ఫలితాలు తేడా రావటమే అనుమానాలకు బలమిస్తోందని అభ్యర్థులు వాపోయారు.
మాన్యువల్ మూల్యాంకనంలో 80 శాతం తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని గ్రూప్-1 అభ్యర్థులు చంద్రబాబు దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత నిర్వహించిన డిజిటల్ మూల్యాకంనంలో 326 మందిని అర్హులుగా ప్రకటించడంతో పాటు పారదర్శకంగా చేశామని.. హైకోర్టులో ఏపీపీఎస్సీ అఫిడవిట్ దాఖలు చేసిందని.. తర్వాత జరిగిన మాన్యువల్ మూల్యాoకనంలో 62 శాతం మంది డిజిటల్లో అర్హత పొందిన వారిని తొలగించారని వివరించారు.
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,544 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్
అయితే ఈ పక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని ఏపీపీఎస్సీ చెప్తోందని.. డిజిటల్ మూల్యాంకనం లేదా మాన్యువల్ మూల్యాంకనంలో ఏది పారదర్శకంగా ఉందో తేలాలంటే న్యాయ విచారణ జరగాల్సిందేనని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలు హడావుడిగా నిర్వహించడంలో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులకు సెలవులు ఉన్న సమయంలో ఈ విధంగా హడావుడి ఇంటర్వ్యూల నిర్వహణతో చాలా మంది అభ్యర్థులు నష్టపోతారన్నారు. చంద్రబాబు తమ పోరాటానికి నైతిక మద్దతు ఇవ్వటంతో పాటు న్యాయ పరంగా అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు.