మహిళా ప్రభుత్వం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది ఏపీలోని ఉద్యోగినులకు పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులకు సంబంధించి మంగళవార రాత్రి ప్రభుత్వ ఆర్థిక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉత్తర్వులను విడుదల చేశారు.
ఈ మేరకు పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందవచ్చు. అలాగే ఈ సెలవులను ఇతర సెలవులతో కలిపి కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. దత్తత శిశువు వయసు నెలరోజుల్లోపు ఉంటే ఏడాది వరకు కూడా సెలవు ఇస్తారు. బిడ్డ వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు ఉంటే ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. తొమ్మిది నెలలు, ఆ పైన వయస్సుంటే మూడు నెలలు సెలవు దొరుకుతుంది. ఇవన్నీ ఇతర సెలవులకు అదనంగా వస్తాయి. అయితే దత్తత తీసుకునే వారికి అప్పటికే ఇద్దరు పిల్లలుంటే ఇవేవీ వర్తించవు.
అటు వికలాంగులైన ఉద్యోగులు తమ కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ సెలవులను పొందవచ్చు. హైరిస్క్ వార్డుల్లో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ సెలవులు తీసుకోవచ్చు. ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బేసిక్ పే లిమిట్ రూ.35,570గా ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ.11,560 నుంచి, రూ.17,780 వరకూ, లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయిస్ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ప్రతినెలా పొందవచ్చు. అలాగే, ఆర్జిత సెలవులు, సగం జీతం సెలవులు ముగిసిన తరువాత కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ సెలవులు తీసుకోవచ్చు.