వివేకా హత్య కేసులో కీలక సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షలు నజరానా ప్రకటించడంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో ఆధారాలిస్తే పారితోషికం ఇస్తామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. వివేకాను చంపింది ఎవరో పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీలను అడిగితే చెబుతారని రామకృష్ణ పేర్కొన్నారు. ఏళ్లతరబడి విచారణ చేస్తున్న కేసు పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా అంశాలపై రామకృష్ణ వ్యాఖ్యానిస్తూ, వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం గెజిట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తయినా నీళ్లు విడుదల చేయని ఏకైక ప్రాజెక్ట్ వెలిగొండ అని ఆయన గుర్తుచేశారు.