RK Roja: రాజకీయాలు అంటే టెన్షన్తో కూడుకున్నవేనని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీపీ సమస్యలు వచ్చాయని, రెండోసారి గెలిచిన తర్వాత షుగర్ సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. నగరి పట్టణంలోని తన నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గంలో పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్లను సన్మానించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏమిటో తమ ప్రభుత్వం చేసి చూపించిందని తెలిపారు. అయితే, ఎన్నికల్లో అబద్ధాలు చెప్పలేకపోయిన కారణంగా ఓటమి పాలయ్యామని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు ప్రజా సమస్యల పరిష్కారంలో విజయవంతమయ్యారని రోజా పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే విధానాన్ని జగన్ అందరికీ నేర్పించారని చెప్పారు. పుత్తూరులో గతంలో ఎంపీపీగా ఉన్న వ్యక్తి చేయలేని అభివృద్ధిని, వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్లు సాధించారని ఆమె ఉదాహరణగా తెలిపారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ప్రతి సర్పంచ్ నేడు గర్వంగా ప్రజల్లో తిరిగే పరిస్థితిని జగన్ సహకారంతో తాను కల్పించానని చెప్పారు. మళ్లీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లే అర్హత తమకే ఉందని, పార్టీ శక్తిని మరోసారి నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. అబద్ధాలతో గెలిచిన పార్టీలకు ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..