మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్టీసీ ప్రకటించింది. శివరాత్రి సందర్భంగా ఏపీలోని 96 శైవక్షేత్రాలకు 3,225 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఆయా బస్సుల్లో గతంలో మాదిరిగానే అదనపు ఛార్జీలు ఉంటాయని తెలిపారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు 410 బస్సులు, శ్రీశైలానికి 390 బస్సులు నడపనున్నట్లు వారు పేర్కొన్నారు.
మరోవైపు కడప జిల్లా పొలతల, నిత్య పూజకోన, పశ్చిమ గోదావరి జిల్లాలోని బలివె, పట్టిసీమ తదితర శైవక్షేత్రాలకు కూడా అధికారులు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డుపై వెళ్లేందుకు ఫిట్ నెస్ ఉన్న బస్సులనే నడుపుతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపేందుకు తర్ఫీదు పొందిన డ్రైవర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బస్టాండ్లలో తాగునీరు సహా మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు.