ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు మిశ్రమ వాతావరణం ఉండబోతోందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రాష్ట్రంలో ద్రోణి బలహీనపడినప్పటికీ, సముద్రం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావం వల్ల రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరగనుండటం గమనార్హం.
10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు
సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర , దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మొదటి మూడు రోజులు గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు ఉండగా, నాలుగో రోజు తర్వాత ఈదురుగాళ్ల ఉధృతి పెరిగి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గదని ఐఎండీ స్పష్టం చేసింది. రాబోయే ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా క్యూములో నింబస్ (Cumulonimbus) మేఘాల ప్రభావం ఉన్న చోట వాతావరణంలో వేగంగా మార్పులు వస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Telangana : ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా.. ఈ బెనిఫిట్ ఎవరికి వస్తుందంటే..?
ఇవి విస్తారంగా కురిసే వర్షాలు కానప్పటికీ, ఈదురుగాలుల వల్ల మామిడి వంటి పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రజలు.. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎత్తైన చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. ఈ వర్షాలు సాధారణంగా గంట లేదా రెండు గంటల పాటు మాత్రమే ఉండి తర్వాత తగ్గుతాయని తెలిపారు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ మిశ్రమ వాతావరణం మరో ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.