రాష్ట్ర అభివృద్ధి, పోర్టుల ఏర్పాటుపై నిర్ణయాధికారం కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇండియన్ పోర్ట్స్ డ్రాఫ్ట్ బిల్లు 2020పై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు.. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ మంత్రి.. బిల్లును అధ్యయనం చేసి పూర్తిస్థాయిలో అభ్యంతరాలు చెప్పటానికి నెల రోజుల సమయాన్ని కేంద్రానికి అడిగినట్టు తెలిపారు.. పోర్టులు ఉమ్మడి జాబితాలో లేవని వ్యాఖ్యానించిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం కానంత వరకు కేంద్రానికి పూర్తిస్థాయిలో సహకరించటానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు.. తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖపై స్పందిస్తూ.. స్టాలిన్ లేఖలోని అంశాలను మేం ఏకీభవిస్తున్నామని తెలిపారు.. అవసరమైతే తీర ప్రాంత రాష్ట్రాలతోనూ మాట్లాడతామన్న గౌతమ్రెడ్డి.. రాష్ట్ర అభివృద్ధి, పోర్టుల ఏర్పాటు పై నిర్ణయాధికారం కేంద్రం చేతిలోకి వెళ్లటాన్ని ఎట్టిపరిస్థిల్లో అంగీకరించేది లేదన్నారు.. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ స్పష్టం చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి.