ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి ముందు సాగితే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు.. అయితే, వైసీపీ, కాంగ్రెస్ దోస్తీ విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్న ఆయన.. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ, అమలు చేయాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నాయకుడే అన్నారు.
Read Also: Pawan Kalyan: ఆడపిల్లలకు రక్షణ కరువు.. దిశ చట్టం ఎప్పటి నుంచి..?
ఇక, కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని ఎదిరించి నిలబడ్డ మొగోడు వైఎస్ జగన్ ఒక్కడే అన్నారు గుడివా అమర్నాథ్… 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం వెతుక్కునే స్థాయికి దిగజార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీతో పొత్తులా..!? నవ్విపోతారు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న విషయం తెలిసిందే.. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో పీకే కీలక పాత్ర పోషించారు.. ఇప్పుడు జాతీయ స్థాయిలో వ్యూహాలకు పదునుపెట్టిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. మరోవైపు, తాజగా కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బయటకు వచ్చింది… దాని ప్రకారం, తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో, ఝార్ఖండ్లో జేఎంఎంతో కలిసి వెళ్లాలని.. తెలంగాణలో విడిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసివెళ్లాలని సూచించారు పీకే. ఈ ప్రతిపాదన ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.