కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం జరిగింది.. మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఈ సందర్భంగా ఆదేశించింది జీవోఎం.. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
థర్డ్ వేవ్ లో అవసరమైన అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించిన జీవోఎం.. అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్స్ పంపిణికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.. ఇక, బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి అన్ని హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని.. ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరిగితే కఠినంగా వ్యవహారించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రులు.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.. చిన్న పిల్లలకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని.. ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో ఉంచాలని జీవోఎం పేర్కొంది.