ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఆర్సీపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది.
ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్న అధికారులు.అత్యవసరమైతేనే ఎస్మా ఉపయోగించాలని అధికారులకు సూచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. సమ్మెలను నిషేధిస్తూ ఇటీవలే జీవో జారీ చేసింది విద్యుత్ శాఖ.
తాము సమ్మెకు వెళ్లడానికి ఆర్టీసీ ఎండీకి ప్రత్యేక నోటీసు అవసరం లేదని.. సీఎస్కు పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన నోటీసు చాలంటున్న ఆర్టీసీ ఉద్యోగులు. ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి ఇప్పటికే అందచేశారు వైద్య, విద్యుత్ శాఖ ఉద్యోగులు. ఓవైపు జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్కు సహకరించడం లేదు ఉద్యోగులు.
4.50 లక్షల బిల్లులకు గానూ.. కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయ్యాయంటోంది ఆర్థిక శాఖ.పరిస్థితి చేయిదాటకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఉద్యమం నుంచి వెనక్కు తగ్గేదే లేదంటున్నారు ఉద్యోగులు.