ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఇకపై ప్రతి టికెట్పైనా 2 శాతం కమీషన్ వసూలు చేయనుంది. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో.. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మూలన సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాల్సిందే. ప్రైవేటు యాప్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసినా ప్రభుత్వానికి రెండుశాతం కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, సినిమా టికెట్ల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయించాలన్న ప్రతిపాదన ఇటీవల చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTVDC) ద్వారా ప్రభుత్వం ఆన్లైన్లో టికెట్లు విక్రయించవచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా టికెట్పై 2 శాతం కమీషన్ తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.