AP Government Changes 10th Class Exams Procedure: పదో తరగతి పబ్లిక్ పరీక్షా విధానంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త మార్పుల్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకూ 11 పేపర్లతో కూడిన పబ్లిక్ పరీక్ష జరగ్గా.. వచ్చే ఏడాది నుంచి ఆ సంఖ్యను ఆరుకి కుదించనుంది. అంటే.. ఇకపై ఆరు పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఈ కొత్త పరీక్షా విధానాన్ని అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా జరుగుతున్న పరీక్షా విధానం మాదిరిగానే.. ఏపీలో పరీక్షా విధానాన్ని మార్చాలని జగన్ సర్కార్ గతంలోనే నిర్ణయం తీసుకుంది. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేసిన అనంతరం 6 పేపర్ల పరీక్షా విధానానికి ఆమోద ముద్ర వేసింది.