తిరుపతి జిల్లా, చంద్రగిరిలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మేనల్లుడు వాసు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులు, వాసు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అసలు ఆయన ఆత్మహత్యాయత్నం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. పిచ్చినాయుడుపల్లెలోని తన 5 ఎకరాల భూమిని శ్మశానం చేశారు.. గ్రామస్తులు శవాలు వేస్తున్నారని వాసు ఆరోపించాడు. పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పాడు. 1986లో ప్రభుత్వం తన తండ్రి ఈశర్వయ్య పేరుపై 5 ఎకరాలకు పట్టా మంజూరు అయ్యిందని.. అయితే తమకు తెలియకుండానే పట్టాను క్యాన్సిల్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించి తిరిగి పట్టాను మంజూరు చేసుకున్నామని చెప్పాడు. కోర్టు వ్యవహారం నడుస్తుండగా గ్రామస్తులు తమ భూమిని స్మశాన వాటిక లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. దీంతో మనస్తాపం చెంది తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు వాసు చెప్పాడు. ఇకనైనా న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యం అని అంటున్నాడు బాధితుడు వాసు…