CM Jagan Review Meeting on Education Department: ఏపీలో విద్యాశాఖపై అధికారులతో శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాకుండా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు-నేడు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. పాఠశాలల్లో ఎలాంటి మరమ్మతులు వచ్చినా వెంటనే బాగుచేసేలా ప్రత్యేక అధికారి చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అన్నారు.
Read Also: India Today Survey: వచ్చే ఎన్నికల్లో మళ్లీ మోదీకే పట్టం.. ఏపీలో వైసీపీకే జై కొట్టిన ప్రజలు
మరోవైపు వచ్చే ఏడాది విద్యాకానుక కింద విద్యార్థులకు అందించే వస్తువులను ఏప్రిల్ నెలాఖరుకే సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటు చేయాలన్నారు. దశలవారీగా డిజిటల్ స్క్రీన్లను పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. అటు పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలని, దీనికోసం ఎస్ఓపీలను రూపొందించాలని సూచించారు. పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్ నాణ్యతను సీఎం జగన్ పరిశీలించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని, టెండర్లు ఖరారుచేసి వెంటనే ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు.
